భారత్ – పాకిస్థాన్ దేశాలు తమ ఆధీనంలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారులు మరియు అణు స్థావరాల జాబితాలను 2008 ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం గురువారం (జనవరి 1, 2026) దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం పాక్ చెరలో 58 మంది పౌర ఖైదీలు, 199 మంది భారతీయ మత్స్యకారులు ఉండగా, భారత దేశం వద్ద 391 మంది పాక్ పౌర ఖైదీలు, 33 మంది మత్స్యకారులు ఉన్నారు. ఖైదీల వివరాలతో పాటు, ఒకరి అణు కేంద్రాలపై మరొకరు దాడి చేయకూడదనే 1988 నాటి ఒప్పందం మేరకు తమ అణు ప్రతిష్ఠానాల సమాచారాన్ని కూడా ఇరు దేశాలు పంచుకున్నాయి. 1992 నుంచి నిరంతరాయంగా సాగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా అణు స్థావరాల జాబితా మార్పిడి జరగడం ఇది వరుసగా 35వ సారి కావడం విశేషం.దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం జనవరి 1 మరియు జూలై 1 తేదీల్లో ఈ జాబితాల మార్పిడి కార్యక్రమం జరుగుతోంది. శిక్షాకాలం పూర్తయిన ఖైదీలను త్వరగా విడుదల చేయాలని, మత్స్యకారుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా చర్చించుకున్నాయి.