సుప్రీంలో SIR విచారణ…స్వయంగా వాదనలు వినిపించిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Spread the love

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా తమ వాదనలు వినిపించారు. ‘సర్’ ప్రక్రియకు సంబంధించి తాను ఎలక్షన్ కమీషన్ కు  ఆరుసార్లు లేఖలు రాసినట్లు ఆమె సుప్రీం కోర్టుకు వివరించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం తాను పోరాటం చేయడం లేదని, ఒక  పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు స్పష్టం చేశారు. కోర్టుకు మమతా బెనర్జీ తెలిపిన అంశాలను ఆ పార్టీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. తెలియజేస్తూ, ఓటరు నమోదు అధికారుల (EROs) అధికారాలను వాస్తవానికి హరించివేసి, దాదాపు 8,300 మంది మైక్రో-అబ్జర్వర్లకు ఆ బాధ్యతలను అప్పగించారని పేర్కొన్నారు. వీరిలో చాలా మంది బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి నియమించబడ్డారని ఆమె తెలిపారు. చట్టబద్ధమైన ప్రాతిపదిక లేని ఈ మైక్రో-అబ్జర్వర్లు, ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే కార్యాలయాల నుండే ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆమె ఎత్తిచూపారు. కొత్త ఓటరు నమోదు కోసం ఇచ్చే ఫారమ్-6 దరఖాస్తులను ఆమోదించడం లేదని, అదే సమయంలో లక్షలాది మంది ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. చివరికి బ్రతికున్న పౌరులను కూడా మరణించినట్లుగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా మహిళా వ్యతిరేకమని, పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకున్న లేదా నివాసం మారిన మహిళలను ఇది ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంటోందని ఆమె విమర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తున్న తీరును తప్పుబడుతూ, ఎన్నికల కమీషన్ ను ఆమె ఒక “వాట్సాప్ కమిషన్” గా అభివర్ణించారు. లిఖితపూర్వక ఉత్తర్వులు, సరైన ప్రక్రియ మరియు జవాబుదారీతనానికి బదులుగా అనధికారిక మెసేజ్‌లే రాజ్యమేలుతున్నాయని ఆమె ఆరోపించారు.