హర్యానాలోని సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ హస్తకళల మేళాలోని ఒక స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులోని ప్రత్యేకతలు ఏంటి అంటారా? బంగారపు పూతతో వేసిన పెయింటింగ్ లే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను కట్టిపడేస్తున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన హస్తకళాకారుడు గోపాల్ ప్రసాద్ శర్మ వీటిని తీర్చిదిద్దారు. 24 క్యారెట్ల బంగారంతో గోపాల్ ప్రసాద్ చేసిన కళాఖండాలు ఆయనకు ఇప్పటికే 36కు పైగా నేషనల్, ఇంటర్నేషనల్ పురస్కారాలు తీసుకొచ్చాయి. అందులో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ మెరిట్ అవార్డు, రాజస్థాన్ గవర్నమెంట్ శిల్పారత్న పురస్కారం కూడా ఉన్నాయి. శ్రీ రామ దర్బార్, మహారణా ప్రతాప్, గాంధీజీ, మదర్ థెరిస్సా వంటి చిత్రాలకు గోపాల్ ప్రసాద్ స్వర్ణంతో రూపునిచ్చి ఆకట్టుకుంటున్నారు. ఆయన రూపొందించిన దాదాపు 500 పెయింటింగ్స్ సూరజ్ కుండ్ మేళాలో ప్రదర్శనకు ఉంచారు.