రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. సంవత్సరం గడుస్తున్న మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావని పేర్కొన్నారు.