ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించడాన్ని కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ చేసిన అపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, నారా లోకేష్, రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, గొట్టిపాటి రవి, కొల్లు రవీంద్ర తదితరులు నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్ ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. ఇటువంటి చర్యలు ఛైర్మన్ ఎలా అంగీకరిస్తారని మండిపడ్డారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే, శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే, హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు.