ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్

Spread the love

ఏపీ సీఎం చంద్రబాబుతో  కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ప్రపంచ టెక్ దిగ్గజం గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్స్  ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను బిల్ గేట్స్ పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం చంద్రబాబు వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడంపై గేట్స్ ప్రశంసించారు. అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును బిల్ గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని… అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని బిల్ గేట్స్ అన్నారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని తెలిపిన సీఎం చంద్రబాబు.తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని గేట్స్ తెలుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందన్నారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రేట్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను కూడా ఈ సందర్భంగా బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.