తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దీక్షా విరమణ మండపం, 96 గదుల వసతి సదుపాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మను ఇచ్చాడని చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆ రోజు ఆ ప్రమాదం జరిగినప్పుడు పక్కనే ఉన్న ప్రత్యక్ష సాక్షి నా చిరకాల మిత్రుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అని ఆయన ఈ కొండగట్టు నుంచి ప్రాతినిధ్యం వహించడం మరింత ఆనందంగా ఉందన్నారు. అర్చక ప్రముఖులు కోరుకున్నట్లు ఇక్కడ దీక్ష విరమణకు సత్రం కావాలని, అది అప్పటి నుంచే మనసులో ఉందని అక్కడ ప్రజల ఆశీసులతో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో టీటీడీ నుండి చెయ్యడానికి ఇది సాధ్యపడిందని పవన్ తెలిపారు. దీనికి ఆమోదం తెలిపిన టీటీడీ బోర్డు చైర్మన్ బీ.ఆర్.నాయుడు, సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సహా ఇతరత్రా అధికారులందరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో కొండగట్టు ఆలయానికి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని భవిష్యత్తులో మరెన్నో గొప్ప కార్యక్రమాలు కొండగట్టు ఆలయంలో చేయబోతున్నామని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు.